Pithapuram: వృద్ధురాలు దుడ్డి లక్ష్మికి పాడా, పిఠాపురం మున్సిపాలిటీ కొండంత అండ
Pithapuram: పిఠాపురం పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా అందిన ఫిర్యాదుపై పాడా (PADA) పీడీ డాక్టర్ ఎన్.వి. శివరామ్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించారు.
Pithapuram: వృద్ధురాలు దుడ్డి లక్ష్మికి పాడా, పిఠాపురం మున్సిపాలిటీ కొండంత అండ
పిఠాపురం: పిఠాపురం పట్టణంలోని 4వ వార్డు, సాలిపేటకు చెందిన దుడ్డి లక్ష్మి అనే వృద్ధురాలి సమస్య ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ద్వారా అందడంతో, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ్ ప్రసాద్ మరియు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఆమె నివాసాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
సదరు వృద్ధురాలి అవసరాలను గుర్తించిన అధికారులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పాడా తరఫున మంచం, ఫ్యాన్లు, లైట్లు మరియు ఇతర అవసరమైన గృహోపకరణాలను అందజేయనున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా, ఆమెకు ప్రభుత్వ సామాజిక భద్రతా పెన్షన్ మంజూరయ్యే వరకు పిఠాపురం మున్సిపాలిటీ తరఫున ప్రతి నెల రూ.2,000 ఆర్థిక సహాయాన్ని మున్సిపల్ కమిషనర్ అందజేస్తారని తెలిపారు. అలాగే, పిఠాపురం పురపాలక సంఘం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు,అసిస్టెంట్ ఇంజనీర్లు పండ్లు, వస్త్రాలు మరియు నిత్యావసర సరుకులను అందజేసి ఆమెకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును మానవతా దృక్పథంతో పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం మునిసిపల్ కమీషనర్ ఎస్.టి.వి.రాజేశ్వరరావు , పిఠాపురం పురపాలక సంఘం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి రాజు , అసిస్టెంట్ ఇంజనీర్లు వై.అభిలాష్ మరియు వై కమలహాసన్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతరులు పాల్గొన్నారు.




