Anakapalle: అనకాపల్లి టీడీపీలో ముదిరిన అసమ్మతి!
Anakapalle: అనకాపల్లి టీడీపీలో అసమ్మతి జ్వాలలు చెలరేగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోవింద్ను మార్చాలంటూ సీనియర్ కార్యకర్తలు నారా లోకేష్కు అల్టిమేటం జారీ చేశారు.
Anakapalle: అనకాపల్లి టీడీపీలో ముదిరిన అసమ్మతి!
Anakapalle: అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల గోవింద్ వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్న సుమారు వందమందికి పైగా సీనియర్ కార్యకర్తలు తాజాగా ఒకచోట చేరి 'ఇష్టాగోష్టి' పేరిట అసమ్మతి గళం విప్పారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను ఇన్ఛార్జ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కార్యకర్తలకు అండగా ఉండని నాయకుడు తమకు వద్దంటూ వారు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ను మార్చకపోతే భవిష్యత్తులో ఇక్కడ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్రకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.
చివరి ప్రయత్నంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంటనే స్పందించి, అనకాపల్లి నియోజకవర్గ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే తాము ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నామని, ఒకవేళ ఇన్ఛార్జ్ మార్పుపై నిర్ణయం తీసుకోకపోతే నియోజకవర్గంలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటూ కార్యకర్తలు హెచ్చరించారు.




