Karimnagar: డైనమిక్ అధికారిణిగా లక్ష్మీ కిరణ్ ముద్ర: వీడ్కోలు సభలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రశంసలు
Karimnagar: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ బదిలీ. కలెక్టరేట్లో ఘనంగా వీడ్కోలు సమావేశం.
Karimnagar: డైనమిక్ అధికారిణిగా లక్ష్మీ కిరణ్ ముద్ర: వీడ్కోలు సభలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రశంసలు
కరీంనగర్ : జిల్లా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి, పాలనలో తనదైన ముద్ర వేసుకున్న అధికారిగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ గుర్తింపు పొందారని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి డైనమిక్ అధికారిగా ఆమె పేరు సంపాదించుకున్నారని కొనియాడారు.
లక్ష్మీ కిరణ్ బదిలీపై సిద్దిపేట జిల్లాకు వెళుతున్న సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, లక్ష్మీ కిరణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు కరీంనగర్ జిల్లాలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. రెవెన్యూ పరంగా అనేక క్లిష్ట సమస్యలను పరిష్కరించి ప్రజలకు చేరువయ్యారని, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి మెప్పు పొందారని అన్నారు. ముఖ్యంగా రైతులు పండించిన వరి కొనుగోలులో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపారని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు. అకుంఠిత దీక్ష, విధుల పట్ల నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేసిన అధికారిగా లక్ష్మీ కిరణ్ నిలిచారని కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా తనకు ఎంతో గుర్తింపునిచ్చిందని తెలిపారు. ఈ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేయడం జీవితంలో మర్చిపోలేని అనుభవమని పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారులు అందరూ ప్రజా సమస్యల పరిష్కారంలో చక్కటి సహకారం అందించారని తెలిపారు. గత కలెక్టర్ పమేలా సత్పతి, ప్రస్తుత కలెక్టర్ చిత్రా మిశ్రా సారథ్యంలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, వారి మార్గదర్శకత్వంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేశానని
పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా లక్ష్మీ కిరణ్ను జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, టీఎన్జీవో నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు కే. మహేశ్వర్, రమేష్ బాబు, డిఆర్డిఓ శ్రీధర్, ఏవో సుధాకర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, కాళీచరణ్ తహసిల్దారులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




