Illanthakunta: బిక్కవాగు బ్రిడ్జి కోసం ఆమరణ నిరాహార దీక్ష: అక్కెం నాగరాజు
Illanthakunta: ఇల్లంతకుంట మండలం అనంతారం బిక్కవాగుపై వంతెన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 21 నుంచి అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
Illanthakunta: బిక్కవాగు బ్రిడ్జి కోసం ఆమరణ నిరాహార దీక్ష: అక్కెం నాగరాజు
ఇల్లంతకుంట: అనంతారం బిక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం ఏళ్లుగా పూర్తికాకపోవడంపై అక్కెం నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇచ్చిన నెల రోజుల గడువు ముగిసినా పనులు పూర్తికాలేదని పేర్కొన్నారు.
“ఓట్లు ముద్దు.. రోడ్లు వద్దా?” అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన అక్కెం నాగరాజు.. ఎన్నికల సమయంలో ప్రజలు, వారి ఓట్లు గుర్తుకొస్తాయని, సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతారం బిక్కవాగు బ్రిడ్జి సమస్యపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
అనంతారం–రహీంఖాన్పేట రోడ్డు అధ్వానంగా మారడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు, రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్రిడ్జికి ఇరువైపులా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే ఇచ్చిన నెల రోజుల గడువు ముగియడంతో సెప్టెంబర్ 21 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని అక్కెం నాగరాజు స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.




