Karimnagar: భగత్ నగర్ దొంగతనంపై కరీంనగర్ సీపీ క్షేత్రస్థాయి పరిశీలన!
Karimnagar: కరీంనగర్ భగత్ నగర్ లో ముగ్గురు మహిళలను బంధించి 50 తులాల బంగారం, రూ. 20 లక్షల నగదు దోచుకెళ్లిన ఘటనపై యాదగిరి సునీల్ రావు బాధితులను పరామర్శించారు.
Karimnagar: భగత్ నగర్ దొంగతనంపై కరీంనగర్ సీపీ క్షేత్రస్థాయి పరిశీలన!
కరీంనగర్: నిన్న రాత్రి కరీంనగర్ నగరంలోని భగత్ నగర్లో ఒక తీవ్రమైన దుర్ఘటన చోటుచేసుకుంది. దొంగలు భగత్ నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం చౌరస్తా వద్దగల ఒక ఇంట్లో చొరబడి కుటుంబ సభ్యులను బంధించి దోపిడీకి పాల్పడ్డారు. విషయం తెలిసిన వెంటనే బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు దోపిడీ జరిగిన ప్రదేశానికి వెళ్లి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. ఇంట్లో ముగ్గురు మహిళలు, ఒక పెద్ద మనిషి మాత్రమే ఉన్న సందర్భాన్ని చూసి దొంగలు రెచ్చిపోయి, ఆ పెద్ద మనిషి అజ్మత్ అలీ అలియాస్ మున్నాభాయ్, మహిళను ఒకరిని బంధించి భయాందోళనలకు గురిచేశారు. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి, బీరువాలు పగలగొట్టి బంగారం, నగదును దోచుకెళ్లారని అన్నారు.బాధితులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 50 తులాల బంగారం అపహరణకు గురైందని అలాగే, చిట్టీల ద్వారా వచ్చిన సుమారు రూ. 20 లక్షల నగదును కూడా దొంగలు ఎత్తుకెళ్లారని వివరించారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు తీవ్రంగా స్పందించి.. ఆయన వెంటనే కరీంనగర్ సీపీ గారితో ఫోన్లో మాట్లాడారని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకునే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరీంనగర్ సీపీ గారు కూడా స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఈ కేసుపై లోతైన విచారణ ప్రారంభించిందని చెప్పారు. దొంగలను కచ్చితంగా పట్టుకుని, ప్రజల సొత్తును రికవరీ చేస్తారన్న పూర్తి విశ్వాసం మాకు ఉందని అన్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టి, వారిలో నమ్మకాన్ని, భద్రతా భావాన్ని కలిగించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు ఆ దిశగా పనిచేయాలని తెలియజేశారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు చేరుకున్నారని సమాచారం ఉంది. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. దొంగలు మాట్లాడిన భాష, వారి ప్రవర్తన ఆధారంగా వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారా? లేక స్థానికులతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని, రాబోయే ఒకటి, రెండు రోజుల్లోనే పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో ఛేదించి, బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాంపల్లి రేణుక- శ్రీనివాస్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




