Jammikunta: కాంగ్రెస్ది పిరికిపందల రాజకీయం: రాజేష్ ఠాకూర్ ధ్వజం!
Jammikunta: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అరెస్టును ఖండిస్తూ జమ్మికుంటలో బీజేపీ ఎస్సీ మోర్చా నేత రాజేష్ ఠాకూర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Jammikunta: కాంగ్రెస్ది పిరికిపందల రాజకీయం: రాజేష్ ఠాకూర్ ధ్వజం!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమై, ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని రాజేష్ ఠాకూర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్న హక్కులను కాలరాయడం, బీజేపీ నాయకులను అక్రమంగా అడ్డుకోవడం, అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ని అరెస్టు చేయడం ద్వారా బీజేపీ గొంతును నొక్కగలమని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే అది వారి భ్రమ మాత్రమేనని రాజేష్ ఠాకూర్ అన్నారు. ఒక నాయకుడిని అరెస్టు చేస్తే వందలాది మంది కార్యకర్తలు ముందుకు వస్తారని, బీజేపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కాంగ్రెస్ వల్ల కాదని స్పష్టం చేశారు.నల్లగొండలో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన ఘటనలపై న్యాయం కోసం పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోవడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదని, ప్రజల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని రాజేష్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రతి సమస్యపై ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.“బీజేపీ నాయకులను అరెస్టు చేసి ఉద్యమాలను ఆపలేరు.అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను భయపెట్టలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వరకు, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించే వరకు బీజేపీ పోరాటం ఆగదు” అని రాజేష్ ఠాకూర్ హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు.




