చొప్పదండిలో ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం సమీక్ష.. మోడల్ స్కూల్, నైట్ హాల్ట్ బస్సులను పునరుద్ధరించాలని ఆదేశం!
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రవాణా సౌకర్యాల మెరుగుదలపై ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం సమీక్షించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బస్సు సౌకర్యాలు, ప్రయాణికుల అవసరాలు, భద్రతా చర్యలపై అధికారులకు పలు ప్రతిపాదనలు వివరించారు.
ప్రత్యేకంగా కెనాల్ల పక్కన ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాల్లో అల్యూమినియం సేఫ్టీ వాల్స్ నిర్మించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు.
అలాగే గతంలో అందుబాటులో ఉన్న మోడల్ స్కూల్, నైట్ హాల్ట్ బస్సులను తిరిగి పునరుద్ధరించి విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు.
ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బస్ స్టాప్ల ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
స్కూల్, కాలేజీల సమయాలకు అనుగుణంగా బస్సుల నిర్వహణ ఉండాలని, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడపాలని అధికారులకు ఎమ్మెల్యే సత్యం ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సేవలను మరింత బలోపేతం చేయాలని కోరారు.




