Peddapalli: ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి కలెక్టర్!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎలిగేడు, సుల్తానాబాద్ పరిధిలో ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.
Peddapalli: ఓటరు ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి కలెక్టర్!
పెద్దపల్లి: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను, సుల్తానాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డులో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
అనంతరం సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవ్పల్లి గ్రామంలో జరుగుతున్న భూముల సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫారాల పంపిణీ, సేకరణ, ఆన్లైన్ నమోదు పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా బీఎల్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటర్లు ఫారాలను సక్రమంగా నింపేందుకు అవసరమైన సహకారం అందించాలని, వివరాలు పూర్తిగా నమోదు అయ్యేలా మార్గనిర్దేశనం చేయాలని తెలిపారు.
ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎప్పటికప్పుడు సేకరించి, వాటి వివరాలను ఆలస్యం చేయకుండా నిరంతరం ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పరిరక్షణకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా క్షేత్రస్థాయిలో సమగ్రంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం రెబ్బల్ దేవ్పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ లు యాకన్న, బషీరోద్దీన్, మున్సిపల్ కమిషనర్ రమేష్,సంబంధిత బీఎల్వోలు ,తదితరులు పాల్గొన్నారు.




