Boinpalli: కొదురుపాకలో బస్ షెల్టర్లకై డిమాండ్
Boinpalli: బోయిన్పల్లి మండలంలో ప్రయాణికుల అవస్థలపై సీపీఎం ఆగ్రహం.
Boinpalli: కొదురుపాకలో బస్ షెల్టర్లకై డిమాండ్
బోయిన్పల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని వెంకట్రావుపల్లి, కొదురుపాక ప్రాంతాల్లో ప్రయాణికులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వెంకట్రావుపల్లి, కొదురుపాక స్టేజీల వద్ద ఇప్పటివరకు బస్ షెల్టర్లు, మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు కనీసం కూర్చునే సదుపాయం కూడా లేకపోవడం ఆందోళనకరమని అన్నారు.
అదేవిధంగా కొదురుపాక రౌండప్ బోర్డు సుందరీకరణ పనులు కూడా ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులపై స్థానిక పాలకులు దృష్టి సారించాలని కోరారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, మహిళల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని యుద్ధ ప్రాతిపదికన బస్ షెల్టర్లు, మహిళల టాయిలెట్లు, రౌండప్ బోర్డు సుందరీకరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అలాగే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అవసరమైన స్థల సేకరణ పూర్తి చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే మహిళలను సమీకరించి పెద్ద ఎత్తున రహదారి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, మండల నాయకులు కుడుకల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.




