Karimnagar: అధికారుల నిర్లక్ష్యం.. ప్రమాదపు అంచున నాగిరెడ్డిపూర్ వంతెన!

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ మార్గంలోని వంతెన ప్రమాదకరంగా మారింది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 26 April 2026 9:17 AM IST
Karimnagar
X

Karimnagar: అధికారుల నిర్లక్ష్యం.. ప్రమాదపు అంచున నాగిరెడ్డిపూర్ వంతెన!

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ మార్గంలోని వంతెన ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి రవాణాకు ముఖ్యమైన ఈ వంతెనపై రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇరువైపులా ఉన్న దిమ్మెలు (గార్డ్‌వాల్‌లు) కూలిపోవడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోంది. సరైన లైటింగ్ లేకపోవడం, వంతెన అంచుల్లో రక్షణ లేకపోవడం వల్ల చిన్న తప్పిదం జరిగినా వాహనాలు నేరుగా లోయలో పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో చిన్నచిన్న ప్రమాదాలు జరిగినట్లు గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు.

దైనందిన ప్రయాణం చేసే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ వంతెనపై ఆధారపడాల్సి రావడంతో భయం మధ్యనే ప్రయాణం కొనసాగిస్తున్నారు. “ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వంతెనకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని, రక్షణ గోడలను పునర్నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తాత్కాలికంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణభద్రత దృష్ట్యా ఈ వంతెన మరమ్మతులు ఆలస్యం చేయకుండా చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story