Karimnagar: ఉద్యోగుల సహనం పరీక్షించవద్దు: కరీంనగర్లో టీజీఈజేఏసీ హెచ్చరిక
Karimnagar: పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఈహెచ్ఎస్, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కరీంనగర్లో టీజీఈజేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
Karimnagar: ఉద్యోగుల సహనం పరీక్షించవద్దు: కరీంనగర్లో టీజీఈజేఏసీ హెచ్చరిక
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులు తమ జీతాలు, జీవితాలు, కుటుంబాలను పణంగా పెట్టి పోరాడారని, అలాంటి ఉద్యోగులు నేడు తమ న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్రెడ్డి మరియు టీజీవోల జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్ అన్నారు.
TGEJAC ఆధ్వర్యంలో కరీంనగర్ టీఎన్జీవోల సంఘ భవన్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు ఎస్మా కేసులు, రాజద్రోహం కేసుల బెదిరింపులను సైతం లెక్కచేయకుండా ఉద్యమించారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినప్పటికీ, మూడు సంవత్సరాలుగా సమస్యలు పెండింగ్లోనే ఉండటంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని తెలిపారు.
చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉద్యోగుల్లో ఎంతో ఆశ, నమ్మకం నెలకొంది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సెప్టెంబర్ 18న సమావేశం నిర్వహిస్తుందని ప్రకటించడంతో, తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఉద్యోగులు ఆ తేదీ కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారని నాయకులు తెలిపారు.
అయితే సెప్టెంబర్ 18న జరగాల్సిన సమావేశాన్ని మరోసారి వాయిదా వేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోందని అన్నారు. ఇప్పటికే అనేకసార్లు చర్చలు, హామీలు, సమావేశాల కోసం ఎదురుచూసిన ఉద్యోగులకు మళ్లీ వాయిదా పడటం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించే విధంగా వ్యవహరించకుండా, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకుని అమలు చేస్తున్న ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.
ఉద్యోగులు తమ జీతాల నుంచి దాచుకున్న జీపీఎఫ్ తదితర మొత్తాలను సకాలంలో చెల్లించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు సామాజిక భద్రత కల్పించేందుకు సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
గత మూడు సంవత్సరాలుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ నాయకులు అనేక విజ్ఞాపన పత్రాలు సమర్పించడంతో పాటు, పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి చర్చలు జరిపారని తెలిపారు. సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఎన్నోసార్లు ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదటి తేదీన జీతం రావడం తప్ప ఉద్యోగుల జీవితాల్లో ఆశించిన స్థాయిలో గణనీయమైన మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడపకు చేర్చడం, గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడం ఉద్యోగుల బాధ్యతగా కొనసాగుతోందని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని చూసే ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా చూడాలని కోరారు.
ఉద్యోగుల సహనాన్ని బలహీనతగా భావించవద్దని, మూడు సంవత్సరాలు మౌనంగా ఉన్నంత మాత్రాన ఉద్యోగుల్లో ఆవేదన లేదని అనుకోవద్దని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. చర్చలకు రావడం, రాజీ ప్రయత్నాలు చేయడం ఉద్యోగుల సంస్కారం మాత్రమేనని, ఉద్యోగుల ఐక్యతే తమ బలమని తెలిపారు.
ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగుల్లోని అసంతృప్తి మరింత బలమైన ప్రజాస్వామ్య ఉద్యమంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని నాయకులు స్పష్టం చేశారు.
పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఈహెచ్ఎస్, ఉద్యోగుల దాచుకున్న సొమ్ము, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, పెన్షన్ భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఉద్యోగి ప్రభుత్వానికి శత్రువు కాదు – ప్రభుత్వ పాలనలో భాగస్వామి” అని పేర్కొంటూ, ఉద్యోగుల హక్కులను గౌరవించి వారి సమస్యలను పరిష్కరిస్తే వారు మరింత అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి కాళి చరణ్ కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు విజయకుమార్ మహిళా అధ్యక్షులు ఇరుమల్ల శారద పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ నాయకులు యు నాగరాజు సత్యనారాయణ నరేష్ పటేల్ సునీత సూర్య శైలజ సుస్మిత అజ్గర్ అలీ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి బైరి శ్రీనివాస్ శంకర్ అజ్గర్ అలీ వారీస్ నవాబ్ అజయ్ కుమార్ కమలాకర్ శశి కుమార్ గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు.




