Sircilla: ఎల్నినోపై గ్రామసభల్లో రైతులకు అవగాహన: కలెక్టర్
Sircilla: రాజన్న జిల్లాలో ఎల్నినో ప్రభావంపై రైతులకు గ్రామసభల ద్వారా అవగాహన కల్పించాలని, జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Sircilla: ఎల్నినోపై గ్రామసభల్లో రైతులకు అవగాహన: కలెక్టర్
ఎల్నినోపై రైతులకు గ్రామసభల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో: ఎల్నినో ప్రభావంపై రైతులకు గ్రామసభల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం రైతు గ్రామసభలు, జలసిరి పనుల పురోగతి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై వ్యవసాయ, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, వర్షపాతం లోటు, భూగర్భ జలాల తగ్గుదల, నీటి సంరక్షణ వంటి అంశాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండల ప్రత్యేక అధికారి వారానికి కనీసం రెండు గ్రామసభలకు హాజరై రైతులతో నేరుగా మాట్లాడాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తూ అవసరమైన విత్తనాలపై సమాచారం అందించాలని ఆదేశించారు.
జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్పాండ్లు, బోర్వెల్ రీచార్జ్ తదితర నీటి సంరక్షణ పనులను వేగవంతంగా చేపట్టి, వర్షపు నీటిని నిల్వ చేసే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మొదటి దశలో మంజూరైన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండో విడతలో అర్హులైన లబ్ధిదారులకు ప్రాధాన్యమిస్తూ, ముఖ్యంగా గుడిసెలు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న వారికి అవకాశం కల్పించాలని సూచించారు. నిర్మాణాల్లో ఎదురయ్యే సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.




