Sircilla: నూతన కోర్టు భవన పనులను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి!
Sircilla: రూ.82 కోట్లతో నిర్మిస్తున్న నూతన కోర్టు భవన పనులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజి, కలెక్టర్ గరిమ అగ్రవాల్తో కలిసి పరిశీలించారు.
Sircilla: నూతన కోర్టు భవన పనులను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి!
సిరిసిల్ల: కోర్టు భవన నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజి అధికారులను ఆదేశించారు.
శనివారం సిరిసిల్ల పర్యటనకు వచ్చిన జస్టిస్ తుకారాంజికి పంచాయతీరాజ్ అతిథి గృహంలో జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి. పుష్పలత, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
తదుపరి రూ.82 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న సిరిసిల్ల నూతన కోర్టు సముదాయ భవనాన్ని పరిశీలించిన జస్టిస్ తుకారాంజికి ఇంజనీర్లు నిర్మాణ పురోగతిని వివరించారు. ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి. లక్ష్మణాచారి, అజయ్ కుమార్ జాదవ్, జూనియర్ సివిల్ జడ్జి జి. మేఘన, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.




