Karimnagar: విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ మెరిసిన కరీంనగర్ పోలీస్
Karimnagar: లక్నోలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ క్రీడా పోటీల్లో కరీంనగర్ సీసీఎస్ ఉమెన్ ఏఎస్సై పల్లి ఉమారాణి కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించారు.
Karimnagar: విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ మెరిసిన కరీంనగర్ పోలీస్
Karimnagar: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘనంగా నిర్వహించిన అఖిల భారత పోలీస్ క్రీడా పోటీల్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఉమెన్ ఏఎస్సై (WASI) పల్లి ఉమారాణి అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించారు.
ఈ నెల 09.05.2026 నుండి 13.05.2026 వరకు లక్నోలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీలలో, ఉమారాణి టేబుల్ టెన్నిస్ ఉమెన్ డబుల్స్ 50 ఏళ్ళ వయసు విభాగంలో తెలంగాణ పోలీస్ శాఖ తరపున ప్రాతినిధ్యం వహించి, కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్ర పోలీస్ శాఖకు ఆమె మంచి పేరు తీసుకువచ్చారు.
పోటీలు ముగించుకొని నగరానికి చేరుకున్న ఏఎస్సై పల్లి ఉమారాణి కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన కాంస్య పతకాన్ని, సర్టిఫికేట్ను సీపీకి చూపించారు. ఉమారాణి ప్రతిభను సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. 50 ఏళ్ల వయసులోనూ విధి నిర్వహణతో పాటు క్రీడల్లో ఈ స్థాయి ప్రతిభ కనబరచడం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొని ఉమారాణికి అభినందనలు తెలిపారు.




