Karimnagar: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి కలెక్టర్
Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్లో 225 అర్జీలతో ప్రజావాణి. దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం.
Karimnagar: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి కలెక్టర్
కరీంనగర్: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 225 అర్జీలు రాగా.. అత్యధికంగా కరీంనగర్ నగరపాలక కు 58, గృహ నిర్మాణ శాఖకు 56 దరఖాస్తు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం, చీఫ్ సెక్రటరీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. 30 రోజులు దాటిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పరిష్కరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు లాగిన్ లో అప్డేట్ చేయించాలని సూచించారు. పింఛన్ల దరఖాస్తు సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులు ఎవరు మిస్ కావద్దని.. దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
యూనిఫామ్ పంపిణీలో ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పింఛన్ల దరఖాస్తుకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ప్రమాణికం. వృద్ధాప్య పింఛన్ మినహా అన్ని పింఛన్ల దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రతి పంచాయతీ, మండల కేంద్రం, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
చేయూత పింఛన్లకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, మెప్మా పీడీ స్వరూప రాణి మాట్లాడుతూ.. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు తప్ప.. మిగతా అన్నింటికీ (ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు తదితరులు) దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొత్త పింఛన్ల దరఖాస్తు కోసం ఆహార భద్రత కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు వివరించారు. నిబంధనలు మార్చలేదని.. గతంలో ఉన్న నిబంధనలనే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో, మండల కేంద్రంలో, మున్సిపాలిటీలో, నగరపాలికలో పింఛన్లకు సంబంధించి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని.. అనుమానాలు ఉంటే సంప్రదించాలని సూచించారు.
గతంలో గ్రామసభలు, వార్డుసభలు, ప్రజా పాలన వారోత్సవాల సమయంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు.. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని.. గతంలో ఏవైనా పత్రాలు సమర్పించని వారు, దరఖాస్తు చేయనివారు ఇప్పుడు ప్రభుత్వం సూచించిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం.. అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




