Karimnagar: కరీంనగర్ ఆరెపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన!
Karimnagar: కరీంనగర్ ఆరెపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. తక్షణమే మరమ్మతులు చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని అధికారుల ఆదేశం.
Karimnagar: కరీంనగర్ ఆరెపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఆరెపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అవసరమైన మరమ్మతు పనులను తక్షణమే చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
ఆరెపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కలెక్టర్ చిత్రా మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ షర్మిల, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ లక్ష్మీనరసింహారావు, మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, ప్రస్తుత పరిస్థితి, మిగిలి ఉన్న పనులు, అవసరమైన మరమ్మతులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో గుర్తించి వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ పనులు చేపట్టిన సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులను పిలిపించి ఇళ్ల ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన చోట నాణ్యతతో కూడిన మరమ్మతులు చేపట్టి ఇళ్లను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు ఇళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉండకుండా అవసరమైన పనులను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.




