Karimnagar: కొత్తపల్లి స్వయంభు వెంకటేశ్వర స్వామి చిన్నగుట్ట గిరి ప్రదక్షిణ
Karimnagar: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్నగుట్ట గిరి ప్రదక్షిణ భక్తుల గోవింద నామస్మరణ మధ్య అత్యంత వైభవంగా జరిగింది.
Karimnagar: కొత్తపల్లి స్వయంభు వెంకటేశ్వర స్వామి చిన్నగుట్ట గిరి ప్రదక్షిణ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హవేలీ కొత్తపల్లి లో స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిన్నగుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సుమారు 1,500 మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని “గోవిందా… గోవిందా…” నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
ఉదయం 7.15 గంటలకు పూజ్య గురువులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో గోమాత పూజ నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలనే సంకల్పంతో కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం, అరటి పండ్లు, మంచినీరు అందజేశారు. పర్యావరణ పరిరక్షణపై భక్తుల్లో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సురేష్ ఆత్మారామ్ మహారాజ్ మాట్లాడుతూ, ప్రతినెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశి రోజున కొత్తపల్లి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్నగుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ “దేశం – ధర్మం – దేవుడు” అనే ధార్మిక భావనతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు ప్రతినెల జరిగే గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
గిరిప్రదక్షిణ అనంతరం సురేష్ ఆత్మారామ్ చేతులమీదుగా వెంకటేశ్వర స్వామి దేవాలయ ముఖద్వార తోరణానికి భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో బండ గోపాల్ రెడ్డి, బండ కిషన్ రెడ్డి, నరహరి నారాయణ రెడ్డి, పెద్ది కొమురయ్య (కుమార్), శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి, బోగ సుదర్శన్, ముత్యం గణపతి, సామల శ్రీనివాస్, బూస శంకర్, మందల నారాయణ రెడ్డి, లెంకల రాజభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంబికాదేవి, కార్పోరేట్ వేముల కవితాచంద్రశేఖర్, జనార్ధన్ రెడ్డి తదితరులతో పాటు వివిధ పట్టన, గ్రామాలకు చెందిన ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థకు మరియు భక్తులకు శ్రీ వెంకటేశ్వర దేవాలయ ట్రస్టు మరియు కొత్తపల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.




