Karimnagar: పీఎంజే జ్యువెలర్స్ దొంగల పై పీడీ యాక్ట్ నమోదు
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ సంచలన దొంగతనం కేసులో ఐదుగురు ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు. చర్లపల్లి జైలుకు తరలింపు.
Karimnagar: పీఎంజే జ్యువెలర్స్ దొంగల పై పీడీ యాక్ట్ నమోదు
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని పీ.యం.జే. జ్యువెలర్స్లో జరిగిన సంచలన బందిపోటు దొంగతనం కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురు ముఠా సభ్యులపై కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ (Preventive Detention Act) అమలు చేశారు. 2026 మే 3న పీ.యం.జే. జ్యువెలర్స్ షాపులోకి చొరబడిన నిందితులు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి, సుమారు రూ.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ప్రధాన నిందితులైన ఐదుగురిపై 17-08-2026న పీడీ యాక్ట్ అమలు చేశారు. వారిలో రఘునాథ్ కర్మాకర్ @ జాగీరా సింగ్, 41 సంవత్సరాలు, పశ్చిమ బెంగాల్. రావిష్ కుమార్ @ ప్రద్యుమాన్, 23 సంవత్సరాలు, నలంద జిల్లా, బీహార్.సూర్యమణి కుమార్ @ సనోజ్, 21 సంవత్సరాలు, నలంద జిల్లా, బీహార్.
యాదవ్ @ జైనుల్ అబ్దిన్, 33 సంవత్సరాలు, ప్రస్తుతం ఫుల్వారీ షరీఫ్, పాట్నా జిల్లా, బీహార్. మొహమ్మద్ ఆదిల్ ఖాన్, 31 సంవత్సరాలు, ఫుల్వారీ షరీఫ్, పాట్నా జిల్లా, బీహార్. నిందితుల నేర కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించేందుకు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా జైలులో నిందితులకు అందజేసి, అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. పీడీ యాక్ట్ అమలులో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ పట్టణ ఏసీపీ ఎన్. వెంకటస్వామి మరియు కరీంనగర్ రెండవ పట్టణ సీఐ కె. సృజన్ రెడ్డిలను పోలీస్ కమిషనర్ అభినందించారు.
నేరాలకు పాల్పడే వారిపై కరీంనగర్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే నేరస్థులపై చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.




