Karimnagar: కరీంనగర్ సఖి సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: కరీంనగర్ సప్తగిరి కాలనీలోని 'సఖి' వన్ స్టాప్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సంయుక్తంగా సందర్శించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 2 July 2026 9:34 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ సఖి సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్: ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సఖి సెంటర్ అన్ని వేళలా అండగా నిలిచి, వారికి అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాస సేవలను సమర్థవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు.

కరీంనగర్ సప్తగిరి కాలనీలోని సఖి (వన్ స్టాప్) సెంటర్ ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సందర్శించి కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రంలో బాధిత మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కేసుల నిర్వహణ, అత్యవసర సేవలపై అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆపత్కాలంలో ఆశ్రయం కోసం వచ్చే మహిళలు, చిన్నారులకు సిబ్బంది మానవీయ దృక్పథంతో సేవలు అందించాలని సూచించారు. ప్రతి బాధితురాలికి ధైర్యం చెప్పి, వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. బాధితులు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన న్యాయ, వైద్య, మానసిక, పునరావాస సేవలను సమయానికి అందించాలని పేర్కొన్నారు.

అనంతరం సఖి సెంటర్‌లోని రికార్డ్స్ విభాగం, అడ్మినిస్ట్రేటర్ గది, షెల్టర్ గదులను పరిశీలించి, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికతో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా మాట్లాడి ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా సహకారం అందించాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హరి ప్రసాద్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story