Karimnagar: ఘనంగా విద్యా విజయోత్సవం.. ప్రతిభావంతులైన విద్యార్థులకు
Karimnagar: కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘విద్యా విజయోత్సవం’ ముగింపు వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి.
Karimnagar: ఘనంగా విద్యా విజయోత్సవం.. ప్రతిభావంతులైన విద్యార్థులకు
కరీంనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఘనంగా నిర్వహించబడుతున్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ – విద్యా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులను అందజేసి అభినందించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల విజయాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత గురువు స్థానం అత్యంత గొప్పదని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ఉన్నత లక్ష్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని అన్నారు.
పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇదే స్పూర్తితో ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి..
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఒకప్పుడు ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మొగ్గు చూపిన తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు విద్య, క్రీడలు, సాంకేతిక రంగాలతో పాటు వివిధ పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ విద్యార్థులు సాధిస్తున్న విజయాలు విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు నిదర్శనమని, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు.విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్, విద్యాశాఖ ఏడి మాధవి, సెక్టోరల్ అధికారులు మిల్కురి శ్రీనివాస్ , అశోక్ రెడ్డి, దాసి శ్రీనివాస్, ఉమారాణి, మహేందర్, రవీందర్, డిసిఇబి కార్యదర్శి భగవంతయ్య, ఎంఈఓ లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.




