Karimnagar: రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ అభివృద్ధి సాగాలి: ఎమ్మెల్యే!
Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్లో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Karimnagar: రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ అభివృద్ధి సాగాలి: ఎమ్మెల్యే!
కరీంనగర్: నగర అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు తీసుకెళ్లాలని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పార్టీలకు తావు లేకుండా కేవలం నగర అభివృద్ధి ఒక్కటే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్ కపుల్ దేశాయ్ మరియు ఇంజనీర్ అధికారులతో కలిసి నగర అభివృద్ధిపై ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ప్రస్తుతం నెలకొన్న వివిధ ప్రజా సమస్యలపై చర్చించి, వాటికి తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.
పారిశుద్ధ్యం, విద్యుత్ నిర్వహణ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎక్కడా లోపించకుండా ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సదుపాయాలను మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తుగా అప్రమత్తం కావాలన్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు.
విలీన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ నగరంలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించాలని చొరవ చూపాలని చెప్పారు.
నిధుల సమాన పంపిణీ స్మార్ట్ సిటీ, యూడీఐఎఫ్ (UDIF), యూసీఎఫ్ (UCF) నిధులను ఏ ఒక్క డివిజన్కు పరిమితం చేయకుండా... ప్రతి డివిజన్కూ సమానంగా కేటాయించి సమగ్రంగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్తో పాటు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు నలువాల రవీందర్, గుగ్గిల్లపు జయశ్రీ, సుధగోని మాధవి, జమ్ము, యూసుఫ్, అలీ, గడ్డి ప్రదీప్, మల్లేశం, పలువురు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




