Sircilla; 18 వేల ఎకరాల ఆయకట్టు.. నర్మాల ప్రాజెక్టుపై రైతుల ఆందోళన!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్మాల ఎగువ మానేర్ ప్రాజెక్టులో పూడికతీత, అత్యవసర మరమ్మతులు చేపట్టాలని నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి ప్రభుత్వ విప్
Sircilla; 18 వేల ఎకరాల ఆయకట్టు.. నర్మాల ప్రాజెక్టుపై రైతుల ఆందోళన!
రాజన్న సిరిసిల్ల జిల్లా: దశాబ్దాల చరిత్ర కలిగిన నర్మాల ఎగువ మానేర్ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించి, అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టాలని నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించింది.
ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకోవడంతో దానిపై ఆధారపడిన సుమారు 18 వేల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడిందని సమితి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
గత వరదల్లో ప్రాజెక్టు దిగువ భాగంలోని ఆప్రాన్ కొట్టుకుపోవడంతో పునాదులకు ముప్పు ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన ఆప్రాన్ నిర్మాణం చేపట్టాలని కోరారు.
అదేవిధంగా, గొలుసుకట్టు కాలువల పునరుద్ధరణ, తుప్పు పట్టిన షట్టర్ల మార్పు, కాలువలకు రక్షణ లైనింగ్ పనులు, ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించి పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి కన్వీనర్ గుఱ్ఱి వేణు, కో-కన్వీనర్లు చాకలి రమేష్, బొజ్జ కనకయ్య, మార్వాడి సుదర్శన్, చెన్నమనేని పురుషోత్తంరావు, బండారి బాల్రెడ్డి, చెక్కపల్లి శ్రీనివాస్, గడ్డం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




