Karimnagar: కరీంనగర్‌లో నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Karimnagar: మే 3న జరగనున్న నీట్ పరీక్షకు కరీంనగర్‌లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 29 April 2026 7:42 AM IST
Karimnagar
X

 Karimnagar

Karimnagar: మే 3న జరగనున్న NEET Entrance Exam నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు ఆదేశించారు. చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వవద్దని స్పష్టం చేశారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, విద్య, వైద్య, పోలీస్ శాఖాధికారులతో కలిసి ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, తాగునీరు, టాయిలెట్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని తెలిపారు. మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.

విద్యార్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉంటుందని, నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఆలుగునూరులోని కేంద్రీయ విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, ఉజ్వల పార్కు సమీపంలోని బాలికల పాలిటెక్నిక్ కళాశాల, చింతకుంట ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, కేబుల్ బ్రిడ్జి సమీపంలోని మైనార్టీ స్కూల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి. శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వాసాల సతీష్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పంకజ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story