Rajanna Sircilla: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ కన్నుమూత
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన నేరెళ్ల పోలీస్ థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.
Rajanna Sircilla: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ కన్నుమూత
రాజన్న సిరిసిల్ల: ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ల థర్డ్ డిగ్రీ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన ఎనిమిది మంది బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు.
గంధం గోపాల్ మృతితో మిగిలిన బాధితులు మరోసారి న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఘటన జరిగి దాదాపు పదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
థర్డ్ డిగ్రీ బాధితుడు బానయ్య మాట్లాడుతూ, న్యాయం కోసం తాము చేయని పోరాటం లేదని, తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన పోలీసు అధికారులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
మరో బాధితుడు కోల హరీష్ మాట్లాడుతూ, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అండగా నిలిచారని, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత తమ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
గంధం గోపాల్ మృతితో నేరెళ్ల థర్డ్ డిగ్రీ ఘటన మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. బాధితులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నారు.




