Sultanabad: కేజీబీవీ విద్యార్థిని టాప్ ర్యాంక్.. ఐఏఎస్ దేవసేన చేతుల మీదుగా అవార్డు అందుకున్న సౌమ్య!
Sultanabad: ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాపర్గా నిలిచింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కేజీబీవీ విద్యార్థిని బట్టు సౌమ్య.
Sultanabad: కేజీబీవీ విద్యార్థిని టాప్ ర్యాంక్.. ఐఏఎస్ దేవసేన చేతుల మీదుగా అవార్డు అందుకున్న సౌమ్య!
సుల్తానాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి జిల్లా విద్యార్థిని బట్టు సౌమ్యకు రాష్ట్రస్థాయిలో ఘన సత్కారం లభించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని MCRHRD సంస్థలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా విజయోత్సవాల వేదికగా సౌమ్య ఈ పురస్కారాన్ని అందుకుంది.
సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదివిన బట్టు సౌమ్య, ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అసాధారణ ప్రతిభకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కే. కేశవరావు, కళాశాల & సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన ఐఏఎస్ గార్ల చేతుల మీదుగా సౌమ్యకు రూ. 25,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందించి ప్రభుత్వం సత్కరించింది.
ఇంగ్లీష్ టీచర్కు ప్రత్యేక గుర్తింపు
ఈ కార్యక్రమంలో భూపతిపూర్ కేజీబీవీ ఇంగ్లీష్ సిఆర్టి (CRT) ఎస్. కవితకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా 100 శాతం ఖచ్చితమైన హాజరును నమోదు చేసినందుకు గాను ఆమెకు ఉన్నతాధికారులు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
కేజీబీవీకి గర్వకారణం: స్పెషల్ ఆఫీసర్ ఎం. స్వప్న
సౌమ్య సాధించిన విజయంపై భూపతిపూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ (SO) ఎం. స్వప్న హర్షం వ్యక్తం చేశారు. "సౌమ్య స్టేట్ ర్యాంక్ సాధించడం మా విద్యాలయానికే గర్వకారణం. ఉపాధ్యాయుల సమిష్టి కృషి, విద్యార్థిని కఠిన శ్రమ వల్లే ఈ అద్భుత మార్కులు సాధ్యమయ్యాయి. సౌమ్యను స్ఫూర్తిగా తీసుకుని కేజీబీవీ విద్యార్థినులందరూ చదువుల్లో మరింత రాణించాలి" అని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొని సౌమ్యకు అభినందనలు తెలిపారు.




