Karimnagar: వెదురు సాగును ప్రోత్సహించాలి: అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్లో తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మేదరులకు భరోసా కల్పించారు.
Karimnagar: వెదురు సాగును ప్రోత్సహించాలి: అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించగల వెదురు సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వెదురును ‘గ్రీన్ గోల్డ్’గా అభివర్ణించిన ఆయన.. వెదురు వృత్తిపై ఆధారపడిన మేదరి కులస్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ, అదనపు కలెక్టర్ స్వామి, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. అనిల్ ప్రకాష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వెదురు సాగుతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు స్థిరమైన ఆదాయ మార్గాలు లభిస్తాయని పేర్కొన్నారు. తరతరాలుగా వెదురు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేదరి కులస్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రపంచ వెదురు సంస్థ (WBO) 2009 నుంచి ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పనలో వెదురుకు ఉన్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
వృత్తి సమస్యలను అధికారుల దృష్టికి..
కార్యక్రమానికి హాజరైన మేదరి కుల ప్రతినిధులు తమ వృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెదురు లభ్యత, వృత్తి పరిరక్షణ, ఉపాధి అవకాశాలు, వెదురు ఉత్పత్తులకు మార్కెటింగ్ తదితర అంశాలపై తమ సమస్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మేదరి కుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చింతల మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షుడు అలిపిరెడ్డి చంద్రమౌళి, బొల్లం రామస్వామి, ఎనుగందుల రమేష్, బొమ్మిడి వేణుగోపాల్, బొల్లం నారాయణ, మొలుగూరి రవీందర్, అలిపిరెడ్డి రామస్వామి, మొగులూరి రాజ్ కుమార్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




