Sircilla: కన్నేపల్లి పంప్ హౌస్ ముట్టడిస్తామని బీఆర్ఎస్వీ హెచ్చరిక!
Sircilla: మానేరు నది ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నది మధ్యలో వాలీబాల్ ఆడి వినూత్నంగా నిరసన తెలిపారు.
Sircilla: కన్నేపల్లి పంప్ హౌస్ ముట్టడిస్తామని బీఆర్ఎస్వీ హెచ్చరిక!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని మానేరు నది ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మానేరు నది మధ్యలో వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరు వరకు నీటి ప్రవాహం ఉండేదని, దీంతో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీటి సరఫరా నిరంతరాయంగా సాగేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మానేరు నది ఎండిపోయి, సిరిసిల్ల పట్టణంలో భూగర్భ జలాలు పడిపోయాయని, వందల అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడడం లేదని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పంపులను వెంటనే ప్రారంభించి ప్రజలకు, రైతులకు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే రైతులకు సాగునీరు అందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాచమల్లు మోహన్, గజభింకర్ చిరంజీవి, సోఫియన్, గడ్డం హరీష్, చిన్న వెంకటేష్, గాజుల మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.




