Sarangapur: కలెక్టర్ రావాలి అంటూ రహదారిపై ధాన్యం పోసి ఆందోళన!
Sarangapur: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో రైతులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు.
Sarangapur: కలెక్టర్ రావాలి అంటూ రహదారిపై ధాన్యం పోసి ఆందోళన!
సారంగాపూర్: మండలంలోని స్వర్ణ గ్రామంలో జొన్న, మక్కలను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ నుంచి మహారాష్ట్ర వెళ్లే రహదారిపై ధాన్యాన్ని పోసి రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలంటూ రైతులు నినాదాలు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న రాత్రి అకాల వర్షం కురియడంతో ధాన్యం తడిసిపోయిందని పేర్కొన్నారు. నెల రోజుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను వేడుకుంటున్నా లారీల కొరత పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతోపాటు గన్ని బ్యాగులను సైతం సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.




