Sircilla: బాల కార్మికులతో పనులు చేయిస్తే జైలుకే.. సిరిసిల్ల కలెక్టర్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూలై 31 వరకు నిర్వహించే 'ఆపరేషన్ ముస్కాన్-12'ను విజయవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
Sircilla: బాల కార్మికులతో పనులు చేయిస్తే జైలుకే.. సిరిసిల్ల కలెక్టర్
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులకు ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్లో తప్పిపోయిన, పారిపోయిన పిల్లలను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బాల కార్మికులతో పని చేయించుకోవడం నేరమని స్పష్టం చేసిన కలెక్టర్... ఇటుక బట్టీలు, బేకరీలు, మెకానిక్ షాపులు, నిర్మాణ పనులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.
దేవాలయాలు, బస్ స్టేషన్లు తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేసే లేదా అనాథలుగా తిరిగే పిల్లలను గుర్తించి విద్యా, సంక్షేమ కార్యక్రమాల్లో చేర్చాలని సూచించారు. అనాథ పిల్లలు లేదా మహిళలు కనిపిస్తే వెంటనే 1098 లేదా 181 హెల్ప్లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం అన్ని శాఖలు కలిసి పనిచేసి ఆపరేషన్ ముస్కాన్-12ను విజయవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.




