Sircilla: విద్యార్థులకు మత్తు పదార్థాలపై పోలీసుల అవగాహన
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు పోలీసులు యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తున్నారు.
Sircilla: విద్యార్థులకు మత్తు పదార్థాలపై పోలీసుల అవగాహన
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అలాగే చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించి మత్తు పదార్థాల వ్యతిరేకంగా చైతన్యం పెంపొందించే ప్రయత్నం చేశారు.
మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీసే సామాజిక సమస్యగా మారిందని అధికారులు పేర్కొన్నారు. స్నేహితుల ప్రభావం, తప్పుడు ప్రచారం లేదా కుతూహలం కారణంగా విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, రవాణా, నిల్వ, విక్రయం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలోని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పోలీసులు కోరారు.




