Karimnagar: కరీంనగర్‌లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ!

Karimnagar: కరీంనగర్‌లో టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ఉద్యోగుల సమస్యలు తీరాలని కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 14 Sept 2026 11:54 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ!

Karimnagar: టీఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహాల వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతి విగ్రహాలను ఉద్యోగులు, భక్తులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “మట్టి గణపతిని పూజిద్దాం… పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం… మట్టి గణపతి మహాగణపతి” అని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు, పర్యావరణం కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు త్వరలో పరిష్కారం లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగులకు నాణ్యమైన పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, హెల్త్ కార్డుల్లోని లోపాల సవరణతో సమర్థవంతమైన ఆరోగ్య సేవలు, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము సకాలంలో అందుబాటులో ఉండే విధానం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ జరగాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనతో ముందుకు సాగాలని, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచి ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషిస్తారని దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ తదితరుల నాయకత్వంలో ఉద్యోగులకు రావలసిన రాజ్యాంగబద్ధమైన హక్కులు నెరవేరాలని, ఉద్యోగుల సమస్యలకు సానుకూల పరిష్కారాలు లభించాలని విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సుభిక్షంగా, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి సంఘము లక్ష్మణరావు జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హరిమేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, గంగారపు రమేష్, పట్టణ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్, పెండ్యాల కేశవరెడ్డి, నేరెళ్ల కిషన్, రాకేష్, శ్రీధర్ తదితర ఉద్యోగ నాయకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR