Jammikunta: రోడ్డుపై ధాన్యం వల్ల ప్రమాదం.. ఇద్దరు మృతి
Jammikunta: జమ్మికుంట సమీపంలో రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు.
Jammikunta
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని వల్గాపూర్ – జగ్గయ్యపల్లె మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల వివరాల ప్రకారం, ఎడ్లబండిని ఢీకొన్న బైక్పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన యువకుడు వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై తెలంగాణ రైతు సహాయ జిల్లా స్థాయి సహకార కార్యదర్శి చెల్పూరి రాములు స్పందిస్తూ, రహదారులపై వరి ధాన్యం, మక్కజొన్న పంటలను ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రైతులు పంటలను రోడ్లపై కాకుండా మార్కెట్ యార్డులు లేదా పొలాల సమీపంలో ఆరబెట్టుకునేలా వ్యవసాయ శాఖ, మార్కెట్ అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారులపై పంటలు ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




