Bhadrachalam: భద్రాచలంలో బిఐఎస్ అధికారుల ఆకస్మిక తనిఖీలు – బంగారం సీజ్
Bhadrachalam: భద్రాచలంలో బంగారు దుకాణాలపై BIS జాయింట్ డైరెక్టర్ అర్జున్ ఆధ్వర్యంలో తనిఖీలు. HUID లేని 272 గ్రాముల బంగారం సీజ్, వ్యాపారుల్లో వణుకు.
Bhadrachalam: భద్రాచలంలో బిఐఎస్ అధికారుల ఆకస్మిక తనిఖీలు – బంగారం సీజ్
భద్రాచలం: భద్రాచలంలో బంగారు దుకాణాలపై BIS అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. BIS జాయింట్ డైరెక్టర్ టీ.ఆర్. అర్జున్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని గోల్డ్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. బంగారు ఆభరణాల విక్రయాల్లో హాల్మార్కింగ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై షాపుల్లోని ఆభరణాలు, హాల్మార్కింగ్ వివరాలు, HUID నంబర్లు, సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు.
ఈ తనిఖీల్లో రెండు బంగారు షాపులు హాల్మార్కింగ్ లైసెన్స్ లేకుండా బంగారు ఆభరణాలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా HUID నంబర్లు లేని సుమారు 272.38 గ్రాముల వివిధ రకాల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీన పరుచుకుని సీజ్ చేశారు.
హాల్మార్కింగ్ లైసెన్స్ లేకుండా బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని BIS అధికారులు హెచ్చరించారు. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని BIS అధికారులు సూచించారు. ఆభరణంపై ఉన్న ఆరు అంకెల HUID నంబర్ను BIS CARE యాప్ ద్వారా పరిశీలించిన తర్వాతనే బంగారం కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
భద్రాచలంలో BIS అధికారులు నిర్వహించిన ఈ ఆకస్మిక తనిఖీలతో గోల్డ్ షాపుల వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క అధికారులు కొన్ని షాపులు తనిఖీలు చేస్తుండగానే మరోపక్క విషయం తెలుసుకున్న మిగతా గోల్డ్ షాపుల వారు షాపులను కూడా తెరవలేదు. మరికొందరైతే షాపులు మాత్రం అప్పటికప్పుడే మూసివేశారు. ఒకసారి బంగారం దుకాణాలపై BIS అధికారులు అకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో ఆ చుట్టుపక్కల వ్యాపారస్తుల్లో ఒక చర్చగా మారింది.




