Kothagudem: చలో హైదరాబాద్ వాయిదా.. 18న సర్కార్‌తో కీలక చర్చలు!

Kothagudem: ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ వాయిదా వేసినట్లు TGEJAC తెలిపింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 10 Sept 2026 2:39 PM IST
Kothagudem
X

Kothagudem: చలో హైదరాబాద్ వాయిదా.. 18న సర్కార్‌తో కీలక చర్చలు!

కొత్తగూడెం: ప్రభుత్వ లిఖితపూర్వక హామీ మేరకే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక TS UTF భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు పీఆర్సీ నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. వచ్చే దసరా నుంచే పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

జేఏసీ జిల్లా కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వంతో ఈ నెల 18న మలిదశ చర్చలు జరపాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీసం మూడు డీఏలను తక్షణమే చెల్లించాలని, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు రూ.11 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

సీపీఎస్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

PRTU TS జిల్లా అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సీపీఎస్ అంశంపై పీఆర్సీ నిపుణులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ ద్వారా ఉద్యోగులకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఈ నెల 18న జరిగే చర్చల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS/NEHS)పై కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఉద్యోగులు ఆందోళన చెందొద్దు

TNGOS జిల్లా కార్యదర్శి భార్గవ చైతన్య మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నిరసనల తీవ్రతను ప్రభుత్వం గుర్తించి, GAD ద్వారా లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఉద్యోగుల అసంతృప్తి డిజిటల్, సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తమవుతోందన్నారు.

జేఏసీ నాయకత్వం వెనక్కి తగ్గలేదని, ఉద్యోగుల ఐక్య బలాన్ని ప్రభుత్వానికి చూపించి చర్చల టేబుల్‌పైకి తీసుకురావడంలో విజయం సాధించిందన్నారు. ఈ నెల 18న జరిగే చర్చల్లో ఉద్యోగులకు స్పష్టమైన ప్రయోజనం కలిగే నిర్ణయాలు తీసుకోకపోతే, జీవోలు జారీ చేయకపోతే 19న జరిగే జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story