Khammam: సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ను నిలదీసిన సీపీఐ(ఎం)!

Khammam: సీతారామ ప్రాజెక్టు పూర్తిపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గడువు ముగుస్తోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సీపీఐ(ఎం) నేత పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 25 Jun 2026 4:26 PM IST
Khammam
X

Khammam: సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ను నిలదీసిన సీపీఐ(ఎం)!

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ధ్వజమెత్తారు.

నిధులను వరదలా పారించి ప్రాజెక్టును 2026 పంద్రాగష్టు లోగా అందుబాటులోకి తీసుకొస్తామని 2024 వైరా సభ, సీతారామ పంప్ హౌస్ ల ప్రారంభం సందర్భంగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని తుంగలో తొక్కారన్నారు. ఈనెల 30న చింతకాని మండలంలో నిర్వహించే రైతు, ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్న సీఎం సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తారో లేదో? స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

సీపీఐ(ఎం) పోరాట ఫలితంగానే దుమ్ముగూడెం (సీతారామ) ప్రాజెక్టు సిద్ధించిందన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంతో పాటు తానూ ఈ ప్రాజెక్టు సాధనకు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావుతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడారు.

+ నెలన్నర రోజుల్లో సీతారామ' పూర్తి చేయగలరా?

కాంగ్రెస్ ను ఆదరించిన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రభుత్వం జిల్లాను నిరాదరణకు గురిచేస్తోందని పోతినేని అన్నారు. 2026 పంద్రాగష్టు లోగా సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తామని స్వయంగా సీఎం పెట్టిన గడువు నెలన్నర రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు.

రూ.18వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రూ.8వేల కోట్లు ఇప్పటికే ఖర్చుపెట్టామని, ఇంకా రూ.10వేల కోట్లతో ప్రాజెక్టు రెండేండ్లలో పూర్తవుతుందని 2024లో సీఎం చెప్పిన మాటను వీడియో రూపంలో ప్రదర్శించారు. సీఎం పెట్టిన 2026 పంద్రాగష్టు గడువుకు ఇంకా నెలన్నర రోజులు మాత్రమే ఉంది... చేయగలరా? అని ప్రశ్నించారు. రూ.18వేల కోట్ల అంచనాలు రూ.19వేల కోట్లకు చేరాయన్నారు.

సీఎం హామీ ఇచ్చిన తర్వాత రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారని, రెండింటిలో కలిపి రూ.600 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ముగ్గురు మంత్రులు తలా ఒక కాల్వ చొప్పున తవ్వుకుంటున్నారని తెలిపారు. శ్రీనివాసరెడ్డి మున్నేరు టూ పాలేరు లింక్ కెనాల్, తుమ్మల రాజీవ్, భట్టి జవహర్ కెనాల్స్ తవ్వుకుంటున్నారని వివరించారు.

ప్రాజెక్టు పూర్తికాకుండా కాల్వలు తవ్వుకుంటే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. 2016 ఫిబ్రవరిలో కేసీఆర్ రోళ్లపాడు వద్ద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. 2003లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం 2,600 కి.మీ పాదయాత్ర చేశారని తెలిపారు.

2012లో తాను జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు దుమ్ముగూడెం నుంచి పాలేరు వరకూ వెయ్యి మంది రైతులతో తాను పాదయాత్ర చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణా గోదావరి అనుసంధానం కోసం ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు విషయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో మంత్రులు కెనాల్స్ తీస్తూ పోతే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు.

124 కి.మీ పొడవున్న సీతారామ ప్రాజెక్టు కెనాల్స్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి 104 కి.మీ పూర్తయ్యాయని చెప్పారు. 104 కి. మీ వద్ద జూలూరుపాడు, దమ్మాయిగూడెం టన్నెల్స్ పూర్తి చేస్తే గోదావరి నీళ్లు పాలేరు రిజర్వాయర్ లో కలుస్తాయన్నారు.

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తారా? లేదా? స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను ఆదరించిన ఖమ్మం జిల్లాలో ఓ ప్రాజెక్టు పూర్తి చేశారా? ఓ పరిశ్రమ, ఓ యూనివర్శిటీ స్థాపించారా? అని నిలదీశారు. ఏమి చేశారని రైతులు, ప్రజలు ఆశీర్వదించాలని ప్రశ్నించారు.

ఎల్ నినో ఎఫెక్ట్ నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న దృష్ట్యా వేసిన పంటల్లో 30శాతం విత్తనాలు మొలకెత్తలేదన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నీళ్లు రాకపోతే ఏంటి పరిస్థితి? అని సీఎంను ప్రశ్నించారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.22వేల కోట్లు నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయిస్తే దీనిలో కేవలం రూ.360 కోట్లు సీతారామకు కేటాయించటం సిగ్గు చేటన్నారు.

2026 ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు రావడాన్ని స్వాగతిస్తున్నామని పోతినేని తెలిపారు. కానీ 2024, 2025 రబీ రైతుభరోసా నిధులు ఇస్తారో... లేదో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. పంటలు వేయడానికి ఇచ్చే రైతుభరోసా నిధులను సంవత్సరాల కొద్దీ పెండింగ్ పెట్టడాన్ని తప్పుబట్టారు.

+ శాంతిభద్రతల క్షీణత

రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని పోతినేని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు హత్య జరిగి 8 నెలలవుతున్నా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హత్యకు పాల్పడిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని రామారావు భార్య చెబుతున్నా పట్టించుకోరా? అని నిలదీశారు. ఈ హత్య విషయమై తేల్చాలని మండల కేంద్రం మొదలు శాసనసభ దాకా దీనిని తీసుకెళ్లామన్నారు.

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని ఈ విషయమై కలిసిన సందర్భాలను వివరించారు. రామారావు హత్య జరిగిన చింతకాని మండలంలోని సభకే సీఎం హజరవుతున్న నేపథ్యంలో ఈ సభా వేదికపై నుంచే దీనికి సమాధానం చెప్పాలని కోరారు. హత్య, దొంతనం, రేప్ ఏది జరిగినా హెూంశాఖ మంత్రిగానూ ఉన్న సీఎం పట్టించుకోరా? అని ప్రశ్నించారు.

+ విద్యారంగానికి చేసిందేంటి?

ఖమ్మం జిల్లా విద్యారంగానికి ప్రభుత్వం చేసిందేంటని సుదర్శన్ నిలదీశారు. ఓ యూనివర్శిటీ నిర్మించారా? అని అడిగారు. ఖమ్మం జిల్లాలో 21 ఎంఈవో పోస్టులుంటే 19, డైట్ కళాశాలలో 13కు 13 పోస్టులు రెగ్యులర్ ఉద్యోగులు లేకుండా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఆలోచన మంచిదే అయినా ఆచరణ ఏదన్నారు.

బ్రేక్ ఫాస్ట్ అమలవుతుందా? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించేలా ఆచరణయోగ్యమైన దిశగా చర్యలు ఉండాలన్నారు. జిల్లా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులను హెచ్చరించారు. జవాబుదారీ ఉండేలా సీఎం ప్రకటనలు ఉండాలని కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story