Kothagudem: పాత కొత్తగూడెం 2BHK ఇళ్లపై విచారణకు డిమాండ్!
Kothagudem: పాత కొత్తగూడెంలో 9 ఏళ్లుగా పూర్తికాని 2BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సమగ్ర అభివృద్ధి వేదిక (SAV) డిమాండ్ చేసింది.
Kothagudem: పాత కొత్తగూడెం 2BHK ఇళ్లపై విచారణకు డిమాండ్!
Kothagudem: పాత కొత్తగూడెంలో 9 ఏళ్లుగా పూర్తికాని 2BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలని సమగ్ర అభివృద్ధి వేదిక (SAV) వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని కోరారు.
పాత కొత్తగూడెం 2BHK ప్రాజెక్టులో 828 ఇళ్లు, 23 బ్లాకులు, G+2 నిర్మాణంగా DPRలో పేర్కొన్నారని తెలిపారు. ప్రాజెక్టు DPR అంచనా వ్యయం రూ.43.884 కోట్లు కాగా, వర్కింగ్ ఎస్టిమేట్ సుమారు రూ.31.07 కోట్లుగా ఉందన్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న సుమారు రూ.12.814 కోట్ల వ్యత్యాసంపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు రూ.17.563 కోట్ల నిధులు విడుదలైనట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ, నిర్మాణ ప్రాంతం ప్రస్తుతం పిచ్చి చెట్లతో శిథిలావస్థలో ఉందని ఆరోపించారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం పలు ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లోనే ఉన్నాయని తెలిపారు.
9 ఏళ్లు గడిచినా ఇళ్ల నిర్మాణం పూర్తికాక పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని శ్రీధర్ అన్నారు. విడుదలైన నిధుల వినియోగం, నిర్మాణం ఆలస్యానికి కారణాలు, నాణ్యతపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు EGR వెస్లీ, M. మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.




