Julurupadu: మాచిన్నపేట తండాలో ‘ప్రజా పాలన’: గ్రామసభకు రాని అధికారులపై నివేదిక ఇవ్వాలని పీడీ ఆదేశం!

Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచిన్నపేట తండాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక గ్రామ సభ. గ్రామాభివృద్ధి, ఉపాధి హామీ, పారిశుధ్య పనులపై పీడీ విద్యాచందన సమీక్ష.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 8 Jun 2026 3:20 PM IST
Julurupadu
X

Julurupadu: మాచిన్నపేట తండాలో ‘ప్రజా పాలన’: గ్రామసభకు రాని అధికారులపై నివేదిక ఇవ్వాలని పీడీ ఆదేశం!

జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలోని మాచిన్నపేట తండా గ్రామపంచాయతీలో సోమవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించబడింది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీమతి విద్యాచందన గారు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (Plastic Waste Management) పై మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.

అలాగే వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు, కాలువల శుభ్రత, నీటి నిల్వలు నివారణ, పారిశుధ్య చర్యల ప్రాధాన్యత గురించి వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబడుతున్న వివిధ అభివృద్ధి పనులు, వాటి ద్వారా గ్రామాలకు కలిగే ప్రయోజనాలు మరియు ప్రజల భాగస్వామ్యం గురించి వివరించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు చేయవలసిన పంటలు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలు మరియు సలహాలను గ్రామ సభలో వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు వాటి ద్వారా అర్హులైన లబ్ధిదారులు పొందగల ప్రయోజనాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామ సభలు ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అత్యంత ప్రభావవంతమైన వేదికలని పేర్కొన్నారు. గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

గ్రామ సభలకు హాజరు కాని శాఖల అధికారుల వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని మండల అభివృద్ధి అధికారి ఎంపీడీవో ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి మండల పంచాయతీ అధికారి తులసీరామ్ గ్రామ సర్పంచ్ ,గ్రామ స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, రైతులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సభ విజయవంతంగా నిర్వహించబడింది.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story