Khammam: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు.. సత్తుపల్లి పోలీస్
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
Khammam: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు.. సత్తుపల్లి పోలీస్
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని, నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో సత్తుపల్లి పట్టణంలో గురువారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
సత్తుపల్లి టౌన్ సిఐ శ్రీహరి, వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏవో సుజాత ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపులను, పలు ట్రాన్పోర్ట్ ను సందర్శించి, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ, నిల్వల పరిస్థితులను పరిశీలించారు.
రైతులకు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. అలాగే ప్యాకెట్లపై ఉన్న వివరాలు, తయారీ తేదీలు, గడువు తేదీలు, కంపెనీ గుర్తింపు తదితర అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను మోసం చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు లేదా నాసిరకం పురుగుమందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలి విత్తనాలు పురుగుమందులు అమ్మవారిపై కేసులు నమోదు చేసి, పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు చేపట్టేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. బిల్లు లేకుండా కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో భవిష్యత్తులో సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే విత్తనాలు లేదా ఎరువుల గురించి వెంటనే పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.




