Kothagudem: కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి
Kothagudem: మండుటెండల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో మధ్యాహ్నం పనులు చేయించవద్దని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.
Kothagudem: కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి
కొత్తగూడెం: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఏప్రిల్ 1 నుండి అమలు కావాల్సిన పెరిగిన డిఏ, ఈఎస్ఐ సర్క్యులర్లను యాజమాన్యం తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లోని సివిల్ డిపార్ట్మెంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాదిమంది కార్మికుల సమస్యలను నెలల తరబడి పెండింగ్ పెట్టడం సరికాదన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య విజ్ఞప్తి మేరకు సీఅండ్ఎండి అంగీకరించిన ఫిబ్రవరి 12 నాటి నో వర్క్- నో పెనాల్టీ సర్క్యులర్ ను త్వరగా ఇవ్వాలన్నారు.
ప్రస్తుతం తీవ్రమైన ఎండల నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులు రోడ్లమీద మండుటెండలో పనులు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మధ్యాహ్నం వేళల్లో పనులు చేయించవద్దని, వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం సరఫరా చేస్తున్న ఓఆర్ఎస్ ప్యాకెట్లలో నాణ్యత లోపించిందని, యాజమాన్యం స్పందించి నాణ్యమైన ప్యాకెట్లను సరఫరా చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్ భాస్కర్, సునీల్, సంపత్, గణేష్, మహేందర్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




