Khammam: సీతారామ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల 'స్పెషల్' ఫోకస్!
Khammam: సీతారామ ప్రాజెక్టు పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
Khammam: సీతారామ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల 'స్పెషల్' ఫోకస్!
Khammam: సీతారామ ప్రాజెక్ట్కు సంబంధించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ట్రంక్ పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. వర్షాకాలం రాకముందే పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సత్తుపల్లి ట్రంక్ వద్ద ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మే నెలాఖరులోపు అసంపూర్తి స్ట్రక్చర్లను పూర్తి చేయాలని ఆదేశించారు.టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న ఆరు స్ట్రక్చర్లను కూడా వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని సూచించారు.టన్నెల్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇంకా సుమారు 30 మీటర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.టన్నెల్ పూర్తికాగానే పైభాగంలోని నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
భూసేకరణకు సంబంధించిన నిధులు ఎక్కడా పెండింగ్లో లేవని, కోర్టు కేసుల్లో ఉన్న భూముల విషయంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రభుత్వపరంగా, న్యాయపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.పనుల్లో ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు ఉంటే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.గత ప్రభుత్వం యాతాలకుంట టన్నెల్ను పరిగణలోకి తీసుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాదాపు 1.78 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.సీతారామ ప్రాజెక్ట్ ద్వారా లక్షా ముప్పై వేల ఎకరాలకు నీరందించనున్నట్లు తెలిపారు.డిస్ట్రిబ్యూటర్ కాల్వల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ సీజన్లోనే సత్తుపల్లి ట్రంక్ ద్వారా నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసం పొందగలమని అన్నారు.అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని, సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సత్తుపల్లి, వేంసూరు, దమ్మపేట మండలాలకు త్వరలోనే నీరందించాలన్నదే లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.




