Sathupalli: సింగరేణితో తెలంగాణ ప్రజలది భావోద్వేగ బంధం డిప్యూటీ సీఎం
Sathupalli: సత్తుపల్లి ఓపెన్కాస్ట్ గనిని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణిని లాభాల బాట పట్టించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ.
Sathupalli: సింగరేణితో తెలంగాణ ప్రజలది భావోద్వేగ బంధం డిప్యూటీ సీఎం
సత్తుపల్లి: పోటీ ప్రపంచంలో సింగరేణి క్యాలరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి తెలంగాణకు ఆత్మలాంటిది.. కార్మికులు, ప్రజలతో 130 ఏళ్ల చరిత్రకలిగిన సింగరేణితో భావోద్వేగ అనుబంధం ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.
ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడమే కాకుండా, రాబోయే తరాలకు లాభదాయకంగా అందించడం మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు. గురువారం సత్తుపల్లిలోని సింగరేణి ఒపెన్ కాస్ట్ బొగ్గుగనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. గనిలో బొగ్గు లభ్యత, పరిమాణం, బొగ్గు క్వాలటీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటుగా
ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, జెన్ కో సీఎండీ హరీష్, సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రూ, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ నిర్వహణలో పాటిస్తున్న పద్ధతులు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యక్షంగా చూడటానికే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. ఓవర్ బర్డెన్ అనేది మైనింగ్ లో బయటకు తీసే మట్టి, రాతి వ్యర్థం. బొగ్గు (Coal) అనేది సింగరేణికి ప్రధాన రాబడి తెచ్చే అత్యంత విలువైన వనరుగా ఆయన అన్నారు.
కాంట్రాక్టర్లకు ఓబి తీసినా, బొగ్గు తీసినా వాల్యూమ్ ప్రకారమే బిల్లులు వస్తాయి కాబట్టి వారి దృష్టిలో రెండూ ఒక్కటే అనిపించవచ్చని, సింగరేణి యాజమాన్యానికి మాత్రం ఓవర్ బర్డెన్, బొగ్గు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలిసి ఉండాలన్నారు. ఫేస్ వద్ద బ్లాస్టింగ్ జరిపి, లోడింగ్ చేసే సమయంలో బొగ్గులో ఓవర్ బర్డెన్ మట్టి, రాళ్ళు కలవకుండా చూడాలన్నారు. ప్రతీ షావల్ దగ్గర, ప్రతీ లోడింగ్ పాయింట్ దగ్గర మన అధికారులు ఉండి కంటిన్యూయస్ మానిటరింగ్ చేయాలన్నారు.
నాణ్యత లేని బొగ్గును రవాణా చేయడం వల్ల అనవసరమైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడమే కాకుండా, థర్మల్ పవర్ ప్లాంట్లలో ప్రొడక్షన్ తగ్గిపోయి ట్రిప్ అవుతాయని అన్నారు. కల్తీ లేని నాణ్యమైన బొగ్గును మాత్రమే జెన్ కోకు ఇతర కస్టమర్లకు సరఫరా చేయాలని అధికారులకు సూచనలు చేశారు.
ఒకప్పుడు బొగ్గు రంగంలో ఏకఛత్రాధిపత్యం ఉండేదని, ఈ రోజు పరిస్థితి మారిందని అన్నారు. మార్కెట్లో ప్రైవేటు సంస్థలు పోటీకి వస్తున్నాయని, విదేశాల నుంచి 'ఇంపోర్టెడ్ కోల్' వస్తోందన్నారు. ఈ కాంపిటీటివ్ మార్కెట్ లో సింగరేణి నిలబడాలంటే అత్యంత నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలన్నారు. అంతేకాక బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడం ముఖ్యమని తెలిపారు. గత పదేళ్ల కాలంలో కొత్త కోల్ బ్లాక్స్ వేలంలో సింగరేణి పాల్గొనకపోవడం వల్ల చాలా అవకాశాలను కోల్పోయామని డిప్యూటీ సీఎం అన్నారు.
ఒక కోల్ బ్లాక్ వేలంలో దక్కించుకుని, అక్కడ భూసేకరణ, అటవీ అనుమతులు సాధించి మైనింగ్ ప్రారంభించడానికి కనీసం 7 నుంచి 8 ఏళ్ల సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి కనీసం 10 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో పని చేయాలని అన్నారు. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరుగుతుంది? దానికి ఎంత బొగ్గు అవసరం? అనేదానిపై సింగరేణి యాజమాన్యం - జెన్ కో యాజమాన్యం కలిసి కూర్చుని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిచర్ల-2, నైని వంటి బ్లాక్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఫారెస్ట్ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించామని అన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగే నూతన కోల్ బ్లాక్స్ వేలంలో సింగరేణి పాల్గొనేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
ప్రపంచం మొత్తం ఈ రోజు గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది. సింగరేణి కూడా కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా సోలార్ ఎనర్జీ రంగంలోకి వేగంగా అడుగులు వేయాలన్నారు. భవిష్యత్తులో థర్మల్ పవర్కు ప్రత్యామ్నాయంగా సోలార్, పంప్డ్ స్టోరేజ్, హైడ్రోజన్, న్యూక్లియర్ ఎనర్జీ వాడకం పెరుగుతుందని అన్నారు. దీనికి అనుగుణంగా సింగరేణి సోలార్ పవర్ ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
మైనింగ్ రంగంలో సింగరేణి సంస్థకున్న అపారమైన అనుభవం, నిపుణులైన సాంకేతిక శక్తి కేవలం బొగ్గుకే పరిమితం కాకూడదన్నారు. సెమీకండక్టర్లు, చిప్ తయారీకి అవసరమైన క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ ప్రక్రియలోకి సింగరేణి ప్రవేశించాలని ఆయన పిలుపునిచ్చారు.
సింగరేణిని కాపాడుకుంటూ, లాభాల బాట పట్టిస్తూ, ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి సిద్ధంగా ఉందని డిప్యూటి సీఎం అన్నారు. అధికారులు, ఇంజనీర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేసి సింగరేణి ప్రభను మరింతగా వెలిగించాలని డిప్యూటీ సీఎం అన్నారు. అనంతరం కిష్టారం లో నిర్మించిన క్వార్టర్ల ను డిప్యూటీ సీఎం ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సింగరేణి డైరెక్టర్లు ఎల్. వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, యం. తిరుమల రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




