Illandu: ఆధునిక సాంకేతికతతో పోలీసు సేవలు వేగవంతం: ఎస్పీ!

Illandu: ఎస్పీ రోహిత్ రాజు ఇల్లందు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీటీఎన్‌ఎస్ 2.0, నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు.

SHOBAN BABU, YELLANDU
Published on: 17 Aug 2026 5:06 PM IST
Illandu
X

Illandu: ఆధునిక సాంకేతికతతో పోలీసు సేవలు వేగవంతం: ఎస్పీ!

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఇల్లందు పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం అధికారులు, సిబ్బందితో స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను బాధ్యతగా పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్టికల్స్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వారి పనితీరు, విధుల నిర్వహణ తీరును పరిశీలించారు.

సీసీటీఎన్ఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ పోలీసు సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ వినియోగంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను నిరంతరం సమీక్షిస్తూ, సంబంధిత వ్యక్తుల కదలికలు మరియు కార్యకలాపాలపై నిఘా కొనసాగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, సీఐ సురేష్, ఎస్సైలు ఉమా, సారంగపాణి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU

Next Story