Sujatanagar: సుజాతనగర్ పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు దిశానిర్దేశం
Sujatanagar: సుజాతనగర్ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ బి. రాహుల్. విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, శుభ్రత పాటించాలని ఉపాధ్యాయులకు కఠిన ఆదేశాలు.
Sujatanagar: సుజాతనగర్ పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు దిశానిర్దేశం
సుజాతనగర్: ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు చక్కటి విద్యాబోధనతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా ఆహారము వేడిగా ఉన్నప్పుడే అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం నాడు సుజాతనగర్ మండలంలోని సర్వారం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, డార్మెటరీ రూమ్, స్టోర్ రూమ్, పరిసరాలు మరియు వంటశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కాసేపు ఉపాధ్యాయుని పాత్ర పోషించి ప్రాథమిక స్థాయి విద్యార్థులతో ఉద్దీపకం వర్క్ బుక్ లోని గణితం మరియు ఆంగ్లంలో వివిధ రకాల పదాలను గుణకారాలు, బాగాహారాలను పిల్లల చేత బోర్డుపై వ్రాయించి ఇంగ్లీష్ వర్క్ బుక్ లోని పదాలను పిల్లల చేత చదివించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులలో ఇండ్లకు వెళ్లిన పిల్లలు ఉద్దీపకం వర్క్ బుక్ లోని కొన్ని పదాలు చతుర్వేదికలు, కూడికలు, తీసివేతలు, బాగాహారాలు చేయడంలో కాస్త వెనుక పడ్డట్టు కనిపిస్తున్నారని, ప్రతిరోజు వారికి హోంవర్క్ తో పాటు వర్క్ బుక్ లోని ప్రతి అంశం పిల్లల చేత రాయించి చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
గత పదవ తరగతి ఫలితాల్లో ఈ పాఠశాలలో రిజల్ట్ తక్కువ శాతం వచ్చిందని, పదవ తరగతి విద్యార్థులను పరీక్షల చివరి 100 రోజుల వరకు వేచి ఉండకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే క్రమబద్ధమైన కార్యచరణ ప్రణాళికతో ప్రతిరోజు చదివేలా చూడాలని, విద్యార్థులు కూడా నిరంతర సాధన క్రమశిక్షణ మరియు లక్ష్యంతో కూడిన ప్రణాళికే అత్యుత్తమ ఫలితాలకు మార్గం సుమగమవుతుందని విద్యార్థులకు సూచించారు.
ఈ సంవత్సరం ఈ పాఠశాల పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులతో విద్యార్థులందరూ పాసయ్యేలా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకోవాలని అన్నారు.అలాగే ఉన్నత విద్యా మరియు భవిష్యత్తు ఉద్యోగాల అవకాశాల కోసం ఇప్పటినుంచే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు.
వర్షాకాలం నడుస్తున్నందున పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తాచెదారం పిచ్చి మొక్కలు సైడ్ కాలువలలో పూడికలు తీయించి వర్షపు నీరు బయటకు వెళ్ళిపోయేలా చూడాలని నీరు నిల్వ ఉండటం వలన దోమలు ప్రబలి విద్యార్థులు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ఏఎన్ఎం 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ప్రతిరోజు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనాలు పెడుతున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ చంద్రమోహన్,హెచ్ఎం సునీత, వార్డెన్ తారాచంద్ మరియు ఎస్ సి ఆర్ పి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




