Tragedy: ఖమ్మంలో విషాదం.. పురుగుల మందు తాగి తండ్రీకూతురు మృతి.. ఆస్పత్రిలో కొడుకు
Tragedy: ఖమ్మం జిల్లాలో అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది.
Tragedy in Khammam
Tragedy: ఖమ్మం జిల్లాలో అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ, కనీసం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా ఆ కుటుంబం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇంట విషాదం నింపింది. అభం శుభం తెలియని పిల్లలతో కలిసి తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసరావు అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు (కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్) ఉన్నారు. కుటుంబ పోషణ భారంతో సతమతమవుతున్న శ్రీనివాసరావు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైనట్లు సమాచారం.
పురుగుల మందు తాగించి.. తానూ తాగి..
ఎవరికీ చెప్పుకోలేనంతటి తీవ్రమైన సమస్య ఏది చుట్టుముట్టిందో తెలియదు కానీ, శ్రీనివాసరావు క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముందుగా తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత తానూ ఆ విష పదార్థాన్ని సేవించాడు. కొద్దిసేపటికే ముగ్గురూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కుమారుడు
ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తండ్రి శ్రీనివాసరావు, కుమార్తె లాస్య ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర పరిస్థితిలో ఉన్న కుమారుడు నిఖిల్ను మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఆంబులెన్స్లో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిఖిల్ ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నాడు.
అప్పులబాధే కారణమా?
సమాచారం అందుకున్న వెంటనే నేలకొండపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్మ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. శ్రీనివాసరావుకు ఏమైనా ఆర్థిక సమస్యలున్నాయా? లేదా అప్పుల బాధతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. కుటుంబం మొత్తాన్ని కబలిచిన ఈ విషాద ఘటనతో అప్పల నరసింహాపురం గ్రామంలో కన్నీటి సంద్రం నెలకొంది.




