Kankipadu: గొడవర్రు అభివృద్ధికి రూ.5.80 కోట్లు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

Kankipadu: కంకిపాడు మండలం గొడవర్రు ఎస్సీ కాలనీలో రూ.1.38 కోట్ల రోడ్డు పనులకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.

Ramana, Penamaluru
Published on: 26 Aug 2026 7:16 PM IST
Kankipadu
X

Kankipadu: గొడవర్రు అభివృద్ధికి రూ.5.80 కోట్లు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

కంకిపాడు: కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శాష్కి నిధులు రూ.1.38 కోట్లతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు, అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గొడవర్రు గ్రామంలో సుమారు 600 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ,కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

కాలనీకి వెళ్లేందుకు ఆటోలు కూడా రాని పరిస్థితి ఉండేదని,భారీ వర్షాలు కురిసిన సమయంలో ఇళ్లు ముంపునకు గురైన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు,ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడికి వెళ్లి ప్రజల సమస్యలపై అనేకసార్లు నిరసనలు చేపట్టామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొడవర్రు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని,గత రెండున్నరేళ్లలో సుమారు రూ.5.80 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు తెలిపారు,పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు,NREGS నిధులతో కూడా గ్రామంలోని పలు రహదారులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఒకవైపు అభివృద్ధి...మరోవైపు సంక్షేమం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు,ఉయ్యూరు పట్టణానికి కృష్ణా నది నీటిని అందించేందుకు రూ.100 కోట్లతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు నిన్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని తెలిపారు.

పెనమలూరు నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లలో సుమారు రూ.350 కోట్ల అభివృద్ధి నిధులతో వివిధ పనులు చేపట్టామని,దాదాపు ప్రతి వారం నియోజకవర్గంలోని ఏదో ఒక ప్రాంతంలో శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోందని పేర్కొన్నారు.

తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వివిధ పథకాల కింద సుమారు రూ.50 కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నామని, మరో రూ.50 కోట్లతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు కూడా టెండర్లు పిలిచే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

తాడిగడప మున్సిపాలిటీ ప్రజలకు కృష్ణా నది నీటిని అందించేందుకు సుమారు రూ.400 కోట్లతో DPR సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని త్వరలో ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు, దశలవారీగా నిధులు సమకూర్చి శుద్ధి చేసిన కృష్ణా నది నీటిని తాడిగడప మున్సిపాలిటీ ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు.

ప్రజలు ఒక్క విషయం గమనించాలి,కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమాన్ని,మరోవైపు అభివృద్ధిని ఎక్కడా తగ్గకుండా అమలు చేస్తోంది,అందుకే ఇది ప్రజల ప్రభుత్వం...అభివృద్ధి ప్రభుత్వం* అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అన్నారు.

గొడవర్రు గ్రామంలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. చంద్రబాబు నాయుడు కాలనీ, సాయినగర్ ప్రాంతాల్లో అవసరమైన రహదారులకు నిధులు కేటాయించి పనులు చేపడతామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వ్యవసాయ డొంకలకు కూడా నిధులు కేటాయించి రహదారులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

గొడవర్రు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని,రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story