Unguturu: PHCకి ఈసీజీ మిషన్, ఐసీయూ బెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే!

Unguturu: చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈసీజీ మిషన్, ఐసీయూ బెడ్ విరాళం. ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. దాత నాగేంద్రకు అభినందనలు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 24 July 2026 10:11 AM IST
Unguturu
X

Unguturu: PHCకి ఈసీజీ మిషన్, ఐసీయూ బెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే!

Unguturu: - చేబ్రోలు పీహెచ్‌సీకి ఈసీజీ మిషన్, ఐసీయూ బెడ్ బహుకరణ.. ప్రారంభించిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు..

- ప్రజారోగ్యానికి దాతల సహకారం అమూల్యం.. సేవాభావంతో ముందుకు రావడం అభినందనీయమన్నా ఎమ్మెల్యే ధర్మరాజు గారు..

ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన కీ.శే. బూరుగుపల్లి ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా, ఆయన జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బూరుగుపల్లి నాగేంద్ర గారి సౌజన్యంతో చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కు ఈసీజీ మిషన్, ఐసీయూ బెడ్‌ను బహుకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు రిబ్బన్ కత్తిరించి నూతన వైద్య పరికరాలను ప్రారంభించి ఆసుపత్రి వైద్యులకు అందజేశారు. అనంతరం బూరుగుపల్లి నాగేంద్ర గారు, వారి సతీమణిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు గారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువవుతాయని అన్నారు.ఈసీజీ మిషన్ ద్వారా గుండె సంబంధిత సమస్యలను త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని, ఐసీయూ బెడ్ అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడటంలో ఎంతో కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

సమాజం పట్ల బాధ్యతతో దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులకు సహకరించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story