Markapuram: ఆకస్మిక తనిఖీ.. పనివేళల్లో మూసి ఉన్న గ్రామ కార్యాలయంపై డీడీఓ ఫైర్!
Markapuram: మార్కాపురం డివిజనల్ అభివృద్ధి అధికారి బాలునాయక్ దేవరాజుగట్టు స్వర్ణ గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
Markapuram: ఆకస్మిక తనిఖీ.. పనివేళల్లో మూసి ఉన్న గ్రామ కార్యాలయంపై డీడీఓ ఫైర్!
మార్కాపురం జిల్లా: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు స్వర్ణ గ్రామ కార్యాలయం పనివేళల్లో మూసివేసి ఉందంటూ ఇటీవల HMTV లో వార్తలు ప్రచురించిన నేపథ్యంలో మార్కాపురం డివిజినల్ అభివృద్ధి అధికారి బాలునాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ తనిఖీలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు, స్వర్ణ గ్రామ డిప్యూటీ ఎంపీడీవో (ఇన్చార్జ్) కాజావలి పాల్గొన్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు. అలాగే కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి సేవల అందింపుపై విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించే కేంద్రాలుగా పనిచేయాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కార్యాలయాలు పనివేళల్లో మూసివేయడం, సమయపాలన పాటించకపోవడం, ఆన్లైన్ అటెండెన్స్ నమోదు చేయకపోవడం వంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మీడియాలో ప్రతికూల వార్తలు వచ్చే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తనిఖీ అనంతరం కార్యాలయ పనితీరుపై అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.




