Nandyal: భక్తుల సంతృప్తే లక్ష్యం.. శ్రీశైలం దేవస్థానం సమీక్షా సమావేశం

Nandyal: శ్రీశైలం మల్లన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని దేవస్థానం ఈవో యం. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 April 2026 8:55 PM IST
Nandyal
X

Nandyal: భక్తుల సంతృప్తే లక్ష్యం.. శ్రీశైలం దేవస్థానం సమీక్షా సమావేశం

నంద్యాల జిల్లా: క్షేత్రాన్ని సందర్శించే భక్తులు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా ఆయా ఏర్పాట్లు ఉండాలని శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి యం. శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం సౌకర్యాల కల్పన పట్ల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవస్థానం అన్ని శాఖల అధికారులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెరుగైన సౌకర్యాల కల్పననే దేవస్థానం లక్ష్యమని అన్నారు. దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాదవితరణ, ఉచిత ప్రసాదవితరణ, పారిశుద్ధ్య నిర్వహణ, శౌచాలయాల నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనపై భక్తుల నుంచి 90శాతం సానుకూలత స్పందనే లక్ష్యంగా పనిచేయాలని అన్ని విభాగాలను అదేశించారు.

వేసవితీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా వుండేందుకు క్షేత్రపరిధిలో మరిన్నిచోట్ల చలువపందిర్లు, పైప్‌పెండాల్స్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క సిబ్బంది కూడా భక్తులతో మమేకమై సౌకర్యాల కల్పనపట్ల శ్రద్ధవహించాలన్నారు. సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. ముఖ్యంగా కౌంటర్లలో పనిచేసే సిబ్బంది భక్తులు అడిగే సమాచారాన్ని ఓపికతో తెలియజెప్పాలన్నారు. పెరుగుతున్న ఎండతీవ్రత కారణంగా భక్తులకు మంచినీటిని కల్పించేందుకు క్షేత్రపరిధిలోని ప్రధాన కూడళ్ళలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఈ చలి వేంద్రాలలో మంచినీటితో పాటు భక్తులకు ఉచితంగా మజ్జిగను కూడా అందించాలన్నారు. అన్నప్రసాదాలు మరింత రుచికరంగాను మరియు కాలాతీతం కాకుండా తయారు చేయించాలని అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆదేశించారు.

భక్తుల నుంచి పూర్తిస్థాయి సంతృప్తి వచ్చేవిధంగా అధికారులందరు కూడా క్షేత్రస్థాయిలో ఆయా ఏర్పాట్లను నిరంతర పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను మెరుగుపరుస్తుండాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీకార్యనిర్వహణాధికారిణి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వహణాధికారులు, సంపాదకులు, ప్రజాసంబంధాల అధికారి, అన్నివిభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story