Markapuram: సమస్యల పరిష్కారానికి 'జన్ సునవాయి'.. గిరిజన గూడేల్లో ప్రత్యేక క్యాంపులు!
Markapuram: మార్కాపురం జిల్లాలోని 89 గిరిజన ఆవాసాలలో మే 18 నుండి 25 వరకు ఐటీడీఏ శ్రీశైలం ఆధ్వర్యంలో 'జన్ భాగిదారి' కార్యక్రమం నిర్వహించనున్నారు.
Markapuram: సమస్యల పరిష్కారానికి 'జన్ సునవాయి'.. గిరిజన గూడేల్లో ప్రత్యేక క్యాంపులు!
మార్కాపురం జిల్లా: గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “జన్ భాగిదారి – సబ్ సే దూర్, సబ్ సే పెహలే” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఐటిడిఎ శ్రీశైలం పరిధిలోని నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమం ద్వారా నంద్యాల జిల్లాలో 48, మార్కాపురం జిల్లాలో 89, పల్నాడు జిల్లాలో 82 పీవీటీజీ (ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజన తెగలు) ఆవాసాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాల సమన్వయం కోసం ఆయా జిల్లాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించగా, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు సమన్వయ అధికారులుగా వ్యవహరించనున్నారు. మండల అభివృద్ధి అధికారులు మండల నోడల్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మే 18న మూడు జిల్లాల కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్ల చేత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మే 19న గ్రామ సభలు నిర్వహించి మొక్కల నాటకం చేపడతారు. మే 20న ట్రాన్సెక్ట్ వాక్ నిర్వహించి “జన్ సునవాయి” కార్యక్రమాల తేదీలను ఖరారు చేస్తారు.
అదేవిధంగా మే 19 నుండి 25 వరకు ఎంటైటిల్మెంట్ డ్రైవ్లు, సాచురేషన్ క్యాంపులు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. మే 21 నుండి 23 వరకు “జన్ సునవాయి” కార్యక్రమం కింద ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారు. మే 24న అర్జీలను సమీక్షించి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు జిల్లా కలెక్టర్లకు నివేదిక సమర్పిస్తారు. మే 25న జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని ముగించనున్నారు. ఈ కార్యక్రమంలో చెంచు గూడేల గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐటిడిఎ శ్రీశైలం ప్రాజెక్టు అధికారి కోరారు.




