Kurnool: 38 పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు వేగవంతం చేయాలి!

Kurnool: కర్నూలు జిల్లాలో 38 పరిశ్రమల ప్రాజెక్టులను వేగవంతం చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Aug 2026 3:17 PM IST
Kurnool
X

Kurnool: 38 పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు వేగవంతం చేయాలి!

Kurnool: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, నూతన పెట్టుబడుల ఆకర్షణ, అమలు దశలో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతి, ఎగుమతుల ప్రోత్సాహం, ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమల అభివృద్ధి మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించి పారిశ్రామిక రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో అభివృద్ధి, అమలు దశల్లో ఉన్న పరిశ్రమల పురోగతిని సమీక్షిస్తూ, ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న 38 పరిశ్రమలకు అవసరమైన రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను సత్వరమే కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.

సింగిల్ విండో అనుమతులను నిర్ణీత గడువు లోగా పరిష్కరించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని 7 MSME పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, టెండర్ల ప్రక్రియ, భూకేటాయింపుల పురోగతిపై కూడా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లాలో ఏర్పాటు అవుతున్న పెద్ద, మెగా పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ ఖాళీలను సేకరించి, జిల్లా ఉపాధికల్పన శాఖ సమన్వయంతో క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని ప్రధాన పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, స్థానికులు మరియు ఇతర ప్రాంతాల నుంచి పనిచేస్తున్న వారి వివరాలను సేకరించి విశ్లేషించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఏర్పడనున్న ఉద్యోగ అవకాశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

సమావేశంలో PMEGP, పీఎం విశ్వకర్మ RAMP, IDP 2024–29 పారిశ్రామిక విధానం, ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త పథకం తదితర కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలపై యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడి, ఉపాధి, భూకేటాయింపు, నిర్మాణ పురోగతి, మౌలిక సదుపాయాల అవసరాలను ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్‌లో ఎప్పటికప్పుడు సేకరించి నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను సకాలంలో అందించడం, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన రాయితీ క్లెయిమ్‌లు, దరఖాస్తులపై సమావేశంలో చర్చించి, వాటి మంజూరుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ డానియల్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఉపాధి కల్పనాధికారి దీప్తి, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.జి.వి కృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, ఎల్.డి.యం మోహన్, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ దిలీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story